ఆంధ్రులు ఉద్యమంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ప్రయివేటీకరణ చేయడానికి ఇప్పటికే కంకణం కట్టుకుంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆగేలా కనిపించడంలేదు. సీఎం జగన్ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని ఇప్పటివరకు కనీస విజ్ఞప్తి కూడా చేయలేదు. విశాఖ ఉక్కు నిర్వహించనున్న ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సింగరేణి లేదా ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారా బిడ్ వేయించాలని నిర్ణయించుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరె్స్ట-ఈవోఐ)ను ఆహ్వానించింది. ఈ బిడ్ ప్రకారం… ముడి సరకును సరఫరా చేయాలి… ఉత్పత్తి అయిన ఉక్కును కొనుగోలు చేయాలి. . గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. అందుకే సింగేరణిని రంగంలోకి దించాలని కేసీఆర భావిస్తున్నారు. అధికారులు స్టీల్ ప్లాంట్ కు వెళ్లి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత బిడ్ దాఖలు చేయనున్నారు.
సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంంది. నిజానికి సింగరేణి సాయంతో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ పెడతామని కేసీఆర్, కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. ఎన్నికల్లో లబ్దికి వాడుకున్నారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీ కొంటామంటూ బయలుదేరారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణితో బిడ్ వేయిస్తే.. ఏపీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామంటూ పొరుగు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే… ఏపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందోనంటూ పలువురు సామాజిక వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.