”వారాహి యాత్రలో పవన్ మాట్లాడిన వాటిల్లోనుంచే కొన్నింటిని తీసుకుని తద్వారా జనసేనానిని కాపు నాయకులతోనే టార్గెట్ చేయిస్తే కాపులలో చీలిక వచ్చి విడిపోతారు..” అనే వైసీపీ వ్యూహం ఎంతోకొంత ఫలితం ఇస్తున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం హయాంలో కాపుల రిజర్వేషన్ల ఉద్యమాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చి.. అప్పటి సర్కార్ ను ఇరకాటంలో పెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం .. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత కాపు ఉద్యమాన్ని వదిలేసారు. కారణాలేమైనా కావచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ తూర్పుగోదావరి జిల్లాలోనే కాపుల రిజర్వేషన్లు తమ పరిధిలోలేవని చేతులెత్తేశారు. అయినా ముద్రగడ ఉద్యమం చేయలేదు.
తాజాగా పవన్ వారాహి యాత్రలో భాగంగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో ఆగ్రహం చెందిన ముద్రగడ పవన్ పై లేఖలు యుద్ధం మొదలెట్టారు. దీని వెనుక ఎవరున్నారనేది పెద్దగా అనుమానించక్కర్లేదు. పవన్ .. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ద్వారంపూడి సత్ శీలుడని సర్టిఫికెట్ ఇచ్చారు. పైగా కాపు ఉద్యమానికి ద్వారంపూడి సహకరించారని కూడా ముద్రగడ పేర్కొన్నారు. దీంతో కాపులలో మెజార్టీ నేతలు ముద్రగడపై విరుచుకుపడ్డారు. వైసీపీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ .. అని.. మరొకటని ఆరోపణలు చేసారు. ఈ వ్యవహారంలో మరుగునపడిపోతున్న ముద్రగడ మళ్ళీ తెరపైకి వచ్చినట్లయింది.
”కాపుల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ మంట కాగాలని చూస్తోంది. ఈ దుర్మార్గాన్ని కాపులు గ్రహించాలి..” అని ఓ కాపు ఉద్యమ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అయితే జనసేన-టీడీపీ పొత్తు పై సానుకూలత కనిపిస్తుండటంతో కాపుల మధ్య చిచ్చు రాజేస్తే.. రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందన్న భావంతో వైసీపీ ఈ వ్యూహానికి రూపకల్పన చేసినట్లు భావిస్తున్నారు. అయితే కాపుల మధ్య చెలరేగిన ఈ రగడ ఎన్నాళ్ళు ఉంటుందో వేచి చూడాలి. కాపు పెద్దలు రాజీ కుదీర్చేందుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.