సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదో లేదా కొందరిదో కాదని, అందరిదీ అని గుర్తుంచుకోవాలని పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా రంగం వేరు, రాజకీయాలు వేరని, ఆ స్పష్టత తనకుందని ఆయన వ్యాఖ్యానించారు. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన అంటే సుందరానికీ మూవీ ముందస్తు రిలీజ్ వేడుకల్లో గురువారం పవర్స్టార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నిఎదురు దెబ్బలు తగిలినా చలించకుండా నిలబడగలిగే ధైర్యాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హీరో నాని నటనతో పాటు, ఆయన వ్యక్తిత్వమూ కూడా తనకు ఇష్టమని పవన్కల్యాణ్ అన్నారు. సమస్యలొస్తే నిజాయితీగా, ధైర్యంగా నిలబడే నాని హీరోగా మరిన్ని హిట్లు అందుకోవాలని పవర్ స్టార్ ఆకాంక్షించారు. కథానాయిక నజ్రీన్ తెలుగు పరిశ్రమకు పరిచయడం కావడాన్ని స్వాగతించిన పవన్కల్యాణ్ ఈ చిత్రంలోని ఇతర నటీనటులకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఓ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో వవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు దూరం పెరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే పవర్స్టార్ మాత్రం పూర్తిస్థాయి సంయమనంతో మాట్లాడి తన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక హీరో నాని పవర్స్టార్ ఈ కార్యక్రమానికి హాజరై తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు పవర్ స్టార్కు ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమా మంచి విజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.