మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సహజంగానే చిరంజీవికి వెండితెర వేల్పుగా ఇప్పటికీ తగ్గని క్రేజ్ దీనికి ప్రధాన కారణమైతే, ఈ చిత్రానికి వరుస విజయాలతో ఊపుమీదున్న కొరటాల శివ దర్శకుడు కావడం, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీరోల్ పోషిస్తుండటంతో విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా ఇప్పుడు ఈ మూవీకి మరో అదనపు ఆకర్షణ కూడా జోడైందని ఈ చిత్ర బృందం ప్రకటించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. ఈ విషయాన్ని చెపుతూ మహేష్ కూడా ఈ చిత్రంలో భాగమేనని, ఇది తమకెంతో ఆనందం కలిగించే విషయమని ఈ చిత్ర కథానాయకుడు చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
టాలీవుడ్ హీరోల మధ్య ఉన్న సత్సంబంధాలను ఈ అంశం మరోసారి స్పష్టం చేసిందని చెప్పుకోవాలి. హీరో మహేష్ గతంలో పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ చిత్రానికి కూడా వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఆచార్య చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 23న శనివారం నాడు ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.