పొరుగున ఉన్న పాకిస్తాన్ లో భారీ వరదలు ఆ దేశంలో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తున్నాయ్. పేదరికం ఉన్న ప్రాంతాలల్లో బాలలు మరీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. పాకిస్థాన్లో వరదబారిన చిన్నారులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలన్న పిలుపునకు ఆశించినస్థాయిలో స్పందన లేదని.. యూనిసెఫ్ విచారం వ్యక్తం చేసింది. తాము కోరిన 39 మిలియన్ డాలర్లలో మూడోవంతు కంటే కూడా తక్కువగా విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. మిత్రదేశాలు కూడా పాకిస్థాన్ను బిచ్చగాళ్ల మాదిరిగా చూస్తున్నాయని ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న నేపథ్యంలో యూనిసెఫ్ ప్రతినిధి వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి.
పాకిస్థాన్ వరదల్లో 30 లక్షల మందికిపైగా చిన్నారులు నిరాశ్రయులయ్యారు. మూడు కోట్ల మందిపై వరద ప్రభావం పడింది. భారీ వరదలకు ఊళ్లకుఊర్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పాకిస్థాన్ భూభాగంలో మూడో వంతు ప్రాంతాలు వరద గుప్పిటచిక్కాయి. వరదలొచ్చి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోగా, మరికొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. వరద బారినపడిన 81 జిల్లాల్లోని వేలాది కుటుంబాలు.. బాహ్యాప్రపంచంతో సంబంధాలు కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్నాయి. వారికిసాయం అందించాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్ ప్రతినిధి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆహారం, తాగునీరు, మందులు లేక ఆయా కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆహారకొరత వల్ల చాలా మంది తల్లులు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని వారికి తక్కువ బరువు కలిగిన చిన్నారులు ఉన్నారని యూనిసెఫ్ ప్రతినిధి తెలిపారు.