‘ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలుగొందిన బ్రిటన్ భవిష్యత్ ఆందోళనకరంగా మారుతోంది..’ధరల సెగతో బ్రిటన్ వణికి పోతోంది. ఆ దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 10.1 శాతానికి చేరింది. బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్ఎస్) బుధవారం ఈ వివరాలు విడుదల చేసింది. దీంతో ధరల కట్టడి కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లు మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో ఏ వస్తువుల ధర చూసినా వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు ఆహార ఉత్పత్తుల ధరల సెగ, రిటైల్ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం. జూన్, 2022లో 9.8 శాతంగా ఉన్న వార్షిక ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 12.7 శాతానికి చేరింది. ఇది ప్రమాదకర సూచిగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.