వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. రా కదలిరా సభలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన సతీమణి, ప్రశాంతి టీడీపీలో చేరారు. వారికి పార్టీ జెండా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రాజకీయాల్లో అజాతశత్రువు, ప్రజా సేవకు మారుపేరు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన రాకతో నెల్లూరులో తాము సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు టీడీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు ఉద్ఘాటించారు.