చరిత్రలో కదిరి స్థానం
__ పిళ్లా కుమారస్వామి,సాహితీవేత్త
కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది బేట్రాయి సామి దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి.ఆంధ్ర ప్రదేశ్ లోని సాహిత్యకారులకు, సాహిత్యాభిమానులకు గుర్తుకు వచ్చేది సాహితీ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేమన సమాధి ఉన్న కటారుపల్లె.ఇది కదిరికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఖాద్రీ వృక్షాలతో అలరారిని ఈ ప్రాంతాన్ని ఖదిరా అని పిలిచేవారు.అది అందరి నోళ్లలో ఖదిరీ అయింది. క్రమంగా కదిరి పేరుతో పిలిచారు. ఖదిరి చెట్టు ను చండ్ర చెట్టు అని కూడా పిలుస్తారు.
ఇలాంటి కదిరి ప్రాంతాలను పూర్వం 3 వ శతాబ్దంలో పల్లవ రాజులు, 7వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులు పాలించారు. క్రీ.శ 985 _1076 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణ(నల్లని) శిలతో సుందరంగా చెక్కించి తమ కాలపు కళాత్మక ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ.1191 సంత్సరం వరకు పశ్చిమ చాళుక్యులు , క్రీ.శ.1212 వరకు హొయసల వంశస్థులైన బల్లాల రాజులు పరిపాలించారు. క్రీ.శ. 1274లో వీర బుక్కరాయలు విజయనగరమహా సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన ఆ నాటి ఖాద్రి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఆ నాటి గిరిజన ప్రజానీకం పూజించిన స్థలాన్ని గుర్తించి ఒక మండపాన్ని నిర్మించాడు. దీన్ని క్రీ.శ 1275లో నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు చెపుతున్నాయి .
విజయనగర రాజుల్లో ప్రధానంగా సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశీయుల రాయల సీమ ప్రాంతాన్ని పాలించారు. అనంతపురం జిల్లా ప్రాంతాన్ని దాదాపు అందరూ పాలించిన వారే!
వీరిలో మొదటి బుక్కరాయలు (సంగమ వంశం) క్రీ.శ. 1355-77 విజయనగర రాజ్యాన్ని పాలించారు. ఇతని మహామంత్రి అనంతరాయలు పెనుకొండ దుర్గాన్ని నిర్మించాడు. మొదటి బుక్కరాయల మంత్రి చిక్కప్ప ఓడెయ అనంతసాగరం, బుక్కరాయ సముద్రం (క్రీ.శ. 1344-1377)ప్రాంతాల్లో నిర్మించినాడనీ ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ రెండింటిలోను అనంతసాగరంను రాజుగారి భార్యపేర,బుక్కరాయ సముద్రంను తన రాజుగారి పేరట నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. అక్కడి చెరువును అనంతసాగరంగా పిలిచారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణమందుండే
(A. P. Gazatters, ATP (Dt) Ch I Revol)మొదటి బుక్కరాయల కాలంలో క్రీ.శ. 1352 సంకు చెందిన ఒక శాసనంలో చిక్కప్ప శ్రీమహన్మహా మండలేశ్వర అరిరాయవిలాడ హిందూరాయ నురత్రాణ బొసెగెతపవరాయర గండ పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనే ప్రశస్తులతో వర్ణించబడుతూ కదిరి అవుభళదేవర(నరసింహ స్వామి) నగరి మంటపం నిర్మించినట్లుగా పేర్కొనబడింది.
కదిరి కి 15కి.మీ. దూరంలో ఉన్న పట్నం గ్రామంలోని క్రీ.శ.1367సం॥ శాసనంలో యిదే విధంగా వర్ణింపబడుతూ, పట్నం చెరువు వెనుక శ్రీమన్మహా నాయంకరాచార్యుడొకరు ఇంకొకరికి శ్రీ కదిరి అహోబళదేవర తిరులోనానకు పుట్టెడు మడి ఇచ్చినట్లు చెక్కబడి ఉంది.
కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలోనే క్రీ.శ. 1418 నాటి దేవరాయ శాసనం, ఇదే దేవాలయంలోని క్రీ.శ. 1529 నాటి శ్రీకృష్ణరాయల వారి శాసనం, ఇతర అనేక శాసనాలు నాటి వైష్ణవ మత ధర్మ ప్రశస్తిని చాటుతున్నాయి. ఇదే కదిరి దగ్గరలో ఉన్న పట్నం గ్రామంలో క్రీ.శ. 1547సం॥ నాటి అచ్యుతరాయల కాలంనాటి శాసనం. కదిరి నరసింహదేవునిపై వుండే భక్తి ప్రపత్తుల్ని చాటుతున్నాయి. (ద.హిం.శా.సం. IV సం. 24,83,158) విజయనగర రాజులందరూ వైష్ణవభక్తులుగా వుండినా, పరమత సహనంతో ప్రజానురంజకంగా పాలించినారు.
పూర్వపు కదిరి తాలూకా ప్రస్తుతం ఉన్న గాండ్లపెంట మండలంలో ఉండేది. ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది.1882 వరకు కడప జిల్లా లో ఉన్న పూర్వపు కదిరి తాలుకా బ్రిటిష్ వారి జిల్లాల పునర్విభజనలో 1882లో కదిరి ప్రాంతం అనంతపురం జిల్లాలో కలిసింది. జిల్లా ఏర్పాటులో భాగంగా కడప జిల్లాలోని కదిరి,గాండ్లపెంట, తనకల్లు, నంబులపూలికుంట,తలుపుల, నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు,ఆమడగూరు,ముదిగుబ్బ మండలాలను అనంతపురం జిల్లాలో కలిపారు.
తాలుకా వ్యవస్థలు ఉన్నప్పుడు కదిరి తాలుకా ఉమ్మడి (సమైక్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్దదిగా ఉండేది. అలాగే సమితి బోర్డులు ఉన్నప్పుడు కూడా కదిరిలో రెండు సమితిలు ఉండేవి .రెండు నియజకవర్గాలు కదిరి,నల్లమాడ ఉండేవి.
1. కదిరి తూర్పు ప్రాజెక్టు,2. కదిరి పడమర ప్రాజెక్టు లుగా ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ ప్రాజెక్టులే దీనికి ఉదాహరణ.
పూర్వం పైన చెప్పిన పది మండలాల కలయికనే కదిరి గా పిలిచేవారు. వీటిలో కదిరి (మండలం మరియు పట్టణం), ఎన్.పి కుంట, గాండ్లపెంట, తలుపుల, తనకల్లు, నల్లచెరువు మండలాలు
ప్రస్తుతం కదిరి శాసనసభ నియోజకవర్గంలోకి చేర్చారు.
ముదిగుబ్బ మండలాన్ని ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలోకి తీసుకున్నారు.
నల్లమాడ మండలం, ఓబులదేవర చెరువు,అమడగూరు మండలాలను పుట్టపర్తి నియోజకవర్గంలోకి మార్చారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కదిరి ఒక ముఖ్య పట్టణం.ఒక మండలం.దీని పిన్ కోడ్ 515591. ఎస్.టి.డి కోడ్ 08494. అనంతపురం జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో కదిరి ఒక రెవెన్యూ డివిజన్. ఇది హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది.
కదిరి ప్రజల మనసుల్లాగానే ఇక్కడ మల్లెపూలు విరివిగా దొరుకుతాయి.కదిరి బంతిపూల వనాలతో పాటు కనకాంబరాల సాగుతో రంగురంగుల తోరణాలు కట్టినట్లు సుమనోహరంగా అక్కడక్కడా కనువిందుచేస్తుంది. నొసటన ఎర్రని బొట్టుగా కనిపించే
కదిరి కుంకుమకు ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది.
కదిరి కి సమీపాన 138 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, 145 కి.మీ ల దూరంలో తిరుపతి విమానాశ్రయం,120 కి.మీ దూరంలో కడప విమానాశ్రయం ఉన్నాయి.
ఈ మూడు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో రెండు లేదా మూడు గంటలలో కదిరి చేరుకోవచ్చు.
కదిరి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది పాకాల-ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది.తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ,చెన్నై తదితర ప్రాంతాల నుండి కదిరి స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.
ధర్మవరం, అనంతపురం, కర్నూలు, బెంగ ళూరు, హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుండి కదిరికి చక్కటి రోడ్డు మార్గం ఉంది.
కదిరికి చేరుకోవడం ఎలా?:
కదిరి చేరుకోవడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అక్కడి నుంచి 90 కి.మీ. పుట్టపర్తి నుంచి కేవలం 40 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదంటే నల్లమాడ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుండి మదనపల్లి మీదుగా లేదంటే పీలేరు, రాయచోటి మీదుగా కూడా రావచ్చు.