ఆరు శతాబ్దాల చరిత్రకు సాక్షీభూతం తిమ్మమ్మ మర్రిమాను
__ పిళ్లా కుమారస్వామి, సాహితీవేత్త
తమిళనాడులోని అడయార్ వృక్షం , కర్నాటకలోని లాల్ బాగ్ ఉద్యానవనంలోని మర్రిచెట్టు ,కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లోని వృక్షం, కాశ్మీర్లోని సుందరోద్యానంలోని వృక్షాలకు మించిన వృక్షం, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న మర్రిమాను కరువు నేల కదిరి లో ఉందంటే ఆశ్చర్యమేస్తుంది ఎవరికైనా. దీని పేరు తిమ్మమ్మ మర్రిమాను. ఆరు శతాబ్దాల చరిత్రతో పదకొండొందల ఊడలతో పదెకరాలు విస్తీర్ణంలో విస్తరించినమానిది.
తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ.దూరంలో అనంతపురం నగరానికి 100 కి.మీ దూరంలో, నంబుల పూలికుంట మండలంలోని గూటిబయలు గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరాలు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది.
1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశారు.1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో 8.50 ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.మర్రిమాను కిందికి వెళ్తే ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.ఇంత చరిత్ర కలిగిన ఈ మానుకు తిమ్మమ్మ మర్రిమాను అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా!
తిమ్మమాంబ కు ప్రతిరూపంగా వెలిసిన మర్రిమానుగా ఆమె భక్తులు భావిస్తున్నారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు.
బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప,మంగమ్మ దంపతులకు 1304లో తిమ్మమ్మ జన్మించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుని వివాహం చేసుకుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే వీరయ్యకు కుష్ఠువ్యాధిసోకడంతో గంగరాజు వారిని వెలివేశాడు.వీరయ్య తల్లిదండ్రులు కూడా అది అంటువ్యాధని, కొడుకూ కోడలును ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. రోజు రోజుకూ క్షీణిస్తున్న భర్త ఆరోగ్యం క్రమక్రమంగా పెరుగుతున్న గ్రామస్థుల ఈసడింపులు తట్టుకోలేని తిమ్మమ్మ ఊరి బయట నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవించేది. తిమ్మమ్మ.చుట్టూ దట్టమైన అడవి. పలకరించడానికి ‘నా’ అన్నవారులేని దీనస్థితి మధ్య భయం భయంగా రోజులను నెట్టుకొచ్చేది తిమ్మమ్మ. కొంతకాలానికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్న బాలవీరయ్య అనంతవాయువుల్లో లీనమైపోయాడు.
పతివియోగాన్ని భరించలేక పోయింది తిమ్మమ్మ. గ్రామస్థులు సామాజిక దూరం పాటించడం తో తాను కూడా తనువు చాలించడానికి సిద్దమైంది. కన్నవాళ్ళు అలా చేయవద్దని ఎంతచెప్పినా వినకుండా జాలిలేని ఆ మనసుల మధ్య బతకడానికి మనస్కరించలేదామెకు. చివరకు తన పంతాన్ని వెగ్గించుకుని భర్త చితితో పాటు తానూ ప్రాణత్యాగానికి సిద్ధమయింది తిమ్మమ్మ.
భర్తకు చితి పెట్టడానికి నాలుగువైపులా ఎండిన మర్రిగుంజలను (కర్రలు) నాలుగు పెట్టి మంచెగా ఏర్పాటుచేసింది తిమ్మమ్మ. ఆ మంచెపై కూర్చొని భర్తతోపాటు ఆహుతైపోయింది. కాని, ఆమె నాటిన నాలుగు కొమ్మల్లో మూడు అగ్నికి ఆహుతయ్యాయి. కానీ
ఈశాన్య దిశలో నాటిన కొమ్మ చెక్కు కాలిపోలేదు. అది వర్షాకాలంలో చిగిర్చింది. ఈ కొమ్మే క్రమక్రమంగా పెరిగి శాఖోపశాఖలుగాఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఊడలు దిగి నేటికి మహావృక్షమై ప్రపంచ రికార్డు ల్లోకి ఎక్కింది
రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కరువు నేల కదిరిలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను గురించి ఈనాటికి చాలా మందికి తెలీకపోవడం బాధాకరం. ఆంధ్రరాష్ట్రంలో ఆదినుంచి ఎన్నో ప్రచార సాధనాలున్నా బెంగుళూరుకు చెందిన ఒక జర్నలిస్టు ప్రపంచానికి తెలియజేసే దాకా తిమ్మమ్మ మర్రిమామ సంగతి లోకానికి తెలీదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ మర్రిమాను విషయాన్ని గిన్నిస్ బుక్ లో చేర్చాలని, దీన్ని అభివృద్ధిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ టూరిజంశాఖకు విజ్ఞాపన పంపారు. దీంతో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర టూరిజంశాఖ, ఆటవీ శాఖలు స్వాధీనం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు. ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద “తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది” అని చెక్కబడింది.
తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందింది అని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.
మన తెలుగు తల్లి కీర్తి పరిమళాన్ని దశ దిశలా వ్యాపించజేస్తున్న తిమ్మమ్మ మర్రిమాను కదిరికి 24 కిలో మీటర్ల దూరంలో ఉంది. నంబుల పూలికుంట మండలం గూటిబైలు గ్రామంలో విస్తరించిన ఈ మాను ఆరువందల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచి వుంది.