- వైసీపీ సర్కార్ పై జగన్ వీరాభిమాని, పాదయాత్రలో ఆయనతో కలసి 350 కిలో మీటర్లు నడిచిన ఓ నేత ..దళితులపై జగన్ సర్కార్ చేస్తున్న అరాచకాలను ఎండగట్టడం తీవ్ర సంచలం రేకెత్తించింది.
జగన్ ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులపై తాజాగా వీడియో విడుదల చేశారు. ‘‘కాకినాడలో దళిత వర్గానికి చెందిన డ్రైవర్ హత్య, తొండంగిలో దళిత యువకుడి హత్య, మల్లవరంలో పాలిటెక్నిక్ విద్యార్ధి హత్య వెనుక ముగ్గురు నిందితులు వైసీపీ వారే ఉన్నారని.. డబ్బు, అధికారం ఉంటే హత్యలు చేసి యథేచ్ఛగా బయట తిరగొచ్చా?.. రాజకీయ పార్టీ ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్లను కాపాడటం కరెక్టేనా? కొద్దిరోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు. కుటుంబసభ్యులతో చర్చించాకే ఈ వీడియో విడుదల చేస్తున్నా . ఈ వీడియో నా జీవితాన్ని రిస్క్ లో పెట్టేదే. అయినా సరే జగన్ను ప్రశ్నిస్తూ ఈ వీడియో పెడుతున్నా. హత్య కేసుల్లో ఏ1గా ఉన్నవాడు కార్యకలాపాల్లో పాల్గొనవచా ? ఇలాంటి వి జరిగినపుడు తప్పకుండా మరో సామాజికవర్గం మీ నుంచి దూరం అవుతుంది. బాధిత కుటుంబాలకు డబ్బులు రావొచ్చు. అన్నీ మరచిపోయి బతకొచ్చు. కానీ పేదలు, తక్కువ కులాల వారికి భద్రత ఏమిటి? చనిపోయిన వారిని తిరిగి తీసుకురండి అని అడగడం లేదు. చంపేసిన వాళ్లను శిక్షించండి జైలుకు పంపండి అనీ అడగడం లేదు. రేపు ఇంకొకరి హత్య జరగదు అని నమ్మకం ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా ప్రాణాల్ని కాపాడతామని ప్రభుత్వపరంగా ఏ రకంగా హామీ ఇవ్వగలరు ? చంపిన వాళ్ళను పార్టీల్లో క్రియాశీలకంగా లేకుండా చేసి.. తీవ్రమైన సంకేతం ఇవ్వలేక మీ నుంచి పేదలు దూరమయ్యే అవకాశాలున్నాయి. అంబేడ్కర్ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారు. శృంగ వృక్షంలో జరిగిన హత్య తర్వాత తునిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారనే విషయాన్ని మరచి పోకూడదు. రాము చనిపోవడం వల్ల దళితుల్లో వ్యతిరేకత వస్తుందనే వాదనతో వారిపై ప్రేమ చూపించుకోవడానికి విగ్రహం పెట్టారని అందరికీ తెలుసు. పాదయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి నేనూ చాలా నష్టపోయా. కానీ ప్రభుత్వం వచ్చాక నా కుటుంబానికి సీఎం జగన్ మేలు చేశారు. లాభం పొందానని నేను నోరు మూసుకుని ఉంటే స్వార్థపరుడిని అవుతాను’’ అంటూ సోనీవుడ్ చేసిన కామెంట్స్ వైసీపీ శిబిరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కామెంట్స్ తర్వాత సోనీఫుడ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెపుతున్నారు.