”తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే ఛాన్స్ లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తె హంగ్ వచ్చేలా కనిపిస్తోంది..” ఇదీ ఇండియా టుడే అంచనా.
తెలంగాణ ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేకపోయినా వివిధ సర్వేల అంచనాలు మాత్రం కాంగ్రెస్వైపే ఉంటున్నాయి. లేటెస్ట్గా ఇండియా టుడే(India Toady) ఒపీనియన్ పోల్తో(Opinion Poll) విడుదల చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్కు(Congress) ఆధిక్యమైతే కనిపిస్తున్నది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లను సాధించలేకపోతున్నది. రాబోయేది హంగ్ అసెంబ్లీనేనని ఇండియా టు డే సర్వే కాస్త గట్టిగానే చెబుతోంది. కాంగ్రెస్పార్టీకి 54 స్థానాలు వస్తాయని, అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ 49 సీట్ల కే పరిమితం అవుతుందని ఈ సర్వే చెపుతోంది. అధికారంలోకి వస్తామని పదే పదే చెప్పుకుంటున్న బీజేపీకి(BJP) రెండంకెల సీట్లు కూడా రావని, ఎనిమిది సీట్లకే అది పరిమితం కానున్నదని ఇండియా టు డే- సీ ఓటర్ సర్వే తెలిపింది. ఇతరులు ఎనిమిది స్థానాలలో గెలుస్తారని అంచనా వేసింది. ఈ లెక్కన ఏ పార్టీకి కూడా సింపుల్ మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలు అవసరం.
ఇదే టెంపో కనుక కొనసాగితే సింపుల్ మెజారిటీ సాధించడం కాంగ్రెస్కు కష్టమైన పనేమీ కాదు. రాహుల్గాంధీ చెప్పినట్టు సునామీ కనుక వస్తే మాత్రం కాంగ్రెస్కు భారీ మెజారిటీ రావచ్చు. రీజినల్ అవుట్రీచ్ సర్వే ఇదే చెబుతోంది. కాంగ్రెస్కు 75 స్థానాలు లభిస్తాయిని ఆ సర్వే అంటోంది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని సాధిస్తుందని చెబుతోంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు 44 శాతం ఓట్లు లభిస్తాయని, బీఆర్ఎస్కు 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అధికార బీఆర్ఎస్ ఈ ఎన్నికలలో గెలిచేందుకు డబ్బు యదేచ్చగా ఖర్చు చేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో బీఆర్ఎస్ గట్టెక్కుతుందేమో అంటూ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.