జనసే టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక మార్పులు విభేదాలకు దారితీస్తున్నాయి. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇప్పటికే చాలా మంది తమ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టారు.
టీడీపీ కార్యకర్తలు పిఠాపురం టీడీపీ ఆఫీస్ దగ్గర మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ పాంప్లేట్స్ తగలబెట్టారు. వర్మకు టికెట్ ఇవ్వకపోతే 2014లో మాదిరిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్నారు. అధిష్టానం నుంచి నో అనే సంకేతాలు రావడంతో వర్మతో పాటు ఆయన భార్య భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకోవడం వర్మ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు.
పిఠాపురం టికెట్ వర్మకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు రెండు మూడు రోజులుగా అత్యవసర సమావేశాలు పెట్టుకున్నారు. మరోసారి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు సూచిస్తున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90 వేలకు పైగా ఉన్నాయి. దీంతో పవన్ సునాయాసంగా ఇక్కడ గెలుస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనే క్లారిటీ ఇంకా రాలేదు.