రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కలసి పోటీ చేయాలని ఇప్పటి వరకు ఆలోచించిన బీజేపీ-టీడీపీ ఎవరి దారి వారే చూసుకోవాలిసిన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ఆగడాలను నిలువరించాలంటే కేంద్రం సహకారం అవసరమని ఇన్నాళ్లూ భావిస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీ ఎలాంటి కండిషన్స్ పెట్టినా పొత్తు పెట్టుకోవడానికే రెడీ అయ్యారు. పార్టీ కేడర్ పొత్తు వద్దని వారించినా వారి మాటను ఖాతరు చేయకుండా బీజేపీ పెద్దలతో చర్చలకు వెళ్లారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలనీ బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీకి చెందిన టీడీపీ అంటే గిట్టని సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు పొత్తు లేకుండా చేయడంలో ఎంతోకొంత వర్క్ చేసారు. వారికి కేంద్రంలో, బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో పొత్తు లేకుండా చేయడంలో కృతాకుచులు అయ్యారనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలలో బీజేపీ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలనీ అధిష్ఠానము నుంచి ఆదేశాలు వచ్చాయి. మార్చి 3 వ తేదీన ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత,ఏపీ ఇంచార్జ్ శివ ప్రకాష్ జీ విజయవాడలో పార్టీ ముక్యులతో సమావేశమయ్యారు. ఒక్కో స్తానం నుంచి మూడేసి పేర్లు పంపాలని పార్టీ ముఖ్యలకు సూచించారు. ఈ మేరకు రెండ్రోజులలో ఏపీ ఆశావహుల జాబితా అధిష్టానానికి చేరుతుంది.
ఇదిలా ఉండగా పొత్తు లేకపోయినా.. జగన్ పార్టీ అరాచకాలను నిలువరిస్తామంటూ పవన్ కళ్యాణ్ .. చంద్రబాబుకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వైసీపీ గొడవలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్న రాయలసీమలో జనసేన కేడర్ ని సమాయత్తం చేస్తున్నారు. టీడీపీ-జనసేన కమిటీలు వేసి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.