ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళిని బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షం బాగా పుంజుకుందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగానే అర్థమవుతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు, పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి రెండు సీట్లలో టీడీపీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రాయలసీమ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి రౌండ్లలో ఫలితాల సరళిని బట్టి పూర్తిగా వైసీపీ హవా కొనసాగుతుందని భావించినా అక్కడా వైసీపీ అభ్యర్థికి ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు అధికార పక్షానికి ప్రమాద సంకేతాలు పంపగా.. టీడీపీ శ్రేణుల్లో గట్టి ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి.
ఈ ఎన్నికల పలితాలు ఎందుకు కీలకమంటే..
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజానికి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే 4 స్థానాలను అధికార వైసీపీ గెలుచుకుంది. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నారెండు స్థానాలనూ ఆ పార్టీయే గెలుచుకుంది. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మనీ, మజిల్ పవర్ను వినియోగిస్తుందని ఆరోపిస్తూ ఆ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించింది. దీంతో స్థానిక సంస్థలను ఏకపక్షంగా వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు వారు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలూ వైసీపీ సొంతం చేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సిన పరిస్థితేమీ లేదు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాలను గెలుచుకున్నా గతంలో ఉన్నంత అనుకూల పరిస్థితేమీ కనిపించలేదు. ఇక పట్టభద్రుల ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలకు ఒక రిఫరెండం లాంటివి. 9 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి విస్తరించినవి. పట్టభద్రులు అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకూ ప్రతినిధులు. వారి తీర్పు రాష్ట్రంలోని ప్రజల మనసులో ఏముందో స్పష్టం చేస్తున్నట్టేనని భావించాల్సిఉంది. ముఖ్యంగా విశాఖకు రాజధానిని మారుస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం పదేపదే చెబుతూ వస్తున్న సమయంలో ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడం అధికార పక్షానికి గట్టి షాక్ అనే చెప్పాలి. మూడు రాజధానుల నినాదంపై ప్రజల వ్యతిరేకతనూ సూచిస్తుందని భావించాలి. ఈ ఫలితాలు ఏపీలో విపక్షాల పొత్తులనూ నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది.