తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అనే ప్రాంతీయ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (BRS) గా జాతీయ పార్టీగా మార్పు చేసిన తర్వాత కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఏపీలోనూ తన రాజకీయాలు చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతొ పత్రిక పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ పేరుతొ తెలంగాణలో నడుస్తున్న పత్రిక అక్కడ కాస్తో, కూస్తో ఆధారణ సంపాదించింది. ఏపీ లో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేపర్ ఏర్పాటుకు సంబంధించి మీడియా రంగంలో కీలక వ్యక్తులతో చర్చలు జరిపినట్లు సమాచారం. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ పత్రిక డమ్మీ కాపీలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. విజయవాడతో పాటు. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రింటింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి.. మీడియాలో లబ్దప్రతిష్టులతో టచ్ లో ఉన్నారు. అయితే పత్రిక ఎపుడు నుంచి ప్రారంబించాలనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఉగాదికి తేదీ నిర్ణయించే ఛాన్స్ ఉంది. ఈ పత్రికకు సంపాదకుడు ఎవరిని పెట్టాలనే అంశంపై ఇప్పటికే కేసీఆర్.. నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణ మూర్తి తదితరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.