ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల గతే మీకు పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో దొంగ ఓట్ల సూత్రధారులు, పాత్ర దారులను బీజేపీ వదలదని, ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లు వ్యవహారం పై ఫిర్యాదు చేశామని చెప్పారు.
నకిలీ ఎపిక్ కార్డుల ఎటువంటి సమాచారమైనా బీజేపీ దృష్టికి రావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తోంది. తక్కువ మార్జిన్ తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రకు నాంది పలుకుతుందనే అనుమానం కలుగుతోందని ఆరొపించారు.
కేంద్ర పథకాలు..
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకు వివరించాం. పల్లెకు పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాల్లో నివసించి వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి తెలిపామని, అయోధ్య రామ మందిరం నిర్మాణం ఒక గొప్ప కార్యక్రమం అన్నారు.
రామ మందిరం నిర్మాణంతో హిందూ -ముస్లిం మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలను తిప్పి కొట్టగలిగాం. వివాదాలకు తావు లేకుండా మందిరం నిర్మాణం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నకిలీ ఓటు కార్డులు జారీచేస్తే ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఐఏఎస్, ఐపీయస్ అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్స్ గా వినియోగించుకుంటాం అని ధర్మాన వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషనే వాలంటీర్లను ఎలక్షన్స్ కు దూరంగా ఉంచాలని నిర్ణయించిందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.
తిరుపతి బై ఎలక్షన్లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తి పై అనర్హతగా ప్రకటించాలని ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళామన్నారు. అలాగే పొత్తులపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.