అఖండగోదావరిలో సెకెనుకి 15 లక్షల అడుగుల వరద ప్రవాహం!
అఖండగోదావరిలో వరద ప్రవాహం గురువారం సాయంత్రం సెకెనుకి 15.50 లక్షల ఘనపుటడుగులకు పైగా వుంది ( 15.50 + లక్షల క్యూసెక్కులు) ధవళేశ్వరం కాటన్ బేరేజిలో గేట్లు మొత్తం ఎత్తేసి వచ్చిన వరద వచ్చినట్టే వదిలేస్తున్నారు. 2006 ఆగస్టు నెలలో ఇదే గోదావరి బ్యారేజ్ నుంచి 20.35 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు.
బేరేజి నుంచి దిగువకు వెళ్ళే గోదావరి – తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అనే ఏడుగోదావరులౌతుంది.
విశాలమైన అఖండ గోదావరిలో – వరద దిగువ గోదావరుల్లో కిక్కిరిసినట్టు ప్రవహించే దశలలోనే గట్టు తెగే, చేలూ ఊళ్ళూ కొట్టుకుపోయే ప్రమాదాలు వుండవచ్చు. గోదావరి వరదపై రెండో ప్రమాద హెచ్చరిక అమలులో వుంది. వరద భద్రాచలం నుంచి ధవిళేశ్వం చేరుకోడానికి 24 గంటలు పడుతుంది. ఇందువల్ల శుక్రవారం కూడా ఇలాగే గట్టు అంచులు తాకుతూ గోదావరి వరద కొనసాగుతుంది. ప్రతి నాలుగైదేళ్లకు ఇలాంటి వరద సమస్య తప్పడంలేదు.