శివసేన పార్టీలో తిరుగుబాటు కారణంగా ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంతి పదవిని కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రేకు అంతకుమించిన సవాళ్లు ఎదురుగా నిలుచున్నాయిప్పుడు. ఏకంగా పార్టీయే ఆయన చేజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసలైన శివసేన తమదేనని, అత్యధిక శాతం ఎమ్మెల్యేలతో పాటు పార్టీ క్యాడర్ కూడా తమ వెంటే ఉందని, పార్టీపై నియంత్రణను కూడా తమకే అప్పగించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్షిండే వర్గం ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీలో ఎవరి బలం ఎంతో నిరూపించుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇరువర్గాలనూ ఆదేశించింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నంలోగా మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని ఈసీ సూచించింది.
ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి పులిమీద పుట్ర లాంటి పరిణామమేనని చెప్పాలి. ఎందుకంటే ఠాక్రే ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే పార్టీకి చెందిన మూడొంతులమంది అంటే 40 మంది ఎమ్మెల్యేలు షిండే నాయకత్వంలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అంతేకాదు…ఆ పార్టీ నుంచి గెలిచిన 18 ఎంపీల్లో 12 మంది కూడా షిండే శిబిరంలోకే చేరిపోయారు. అధికారం చేతిలో ఉండీ ఉద్ధవ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. అంతకుముందు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు, అసెంబ్లీని రద్దు చేయించి తిరిగి ఎన్నికలు వచ్చేలా చేసేందుకు ఠాక్రే వర్గం ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించని విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఠాక్రే సీఎం పదవికి రాజీనామ చేయగా, తిరుగుబాటు వర్గం నేత ఏక్నాథ్షిండే బీజేపీ మద్ధతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు ఆయన చురుగ్గా పావులు కదుపుతున్నారు.
మహారాష్ట్రలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈసీ నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లోగా పార్టీపై హక్కుల విషయం తేలకపోతే శివసేన పార్టీ గుర్తును ఎవరికీ కేటాయించకుండా తాత్కాలికంగా వేరే పేర్లు, గుర్తులతో ఉభయులూ ఎన్నికలకు వెళ్లాలని ఈసీ సూచించవచ్చని తెలుస్తోంది. మరాఠా టైగర్ గా పేరొందిన బాల్ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీలో ఈ పరిస్థితి ఎవరూ ఊహించనిదనే చెప్పాలి. గతంలో పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన రాజ్ఠాక్రే ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీని వీడారు. ఉద్ధవ్ దాయాది అయిన రాజ్ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్సేన పేరుతో వేరే పార్టీని పెట్టుకున్నా అది శివసేన పార్టీపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బాల్ఠాక్రే శిష్యుడు ఏక్నాథ్షిండే తిరుగుబాటు మాత్రం ఆ పార్టీ నుంచి ఠాక్రే కుటుంబాన్నే దూరం చేయబోతున్నట్టు కనిపిస్తోంది.