‘వేల కోట్లు అప్పులు ఇవ్వడానికి నియమ నిబంధనలు అక్కర్లేదా?’ అంటూ బ్యాంక్ లను రిజర్వ్ బ్యాంక్ నిలదీసింది..’ ఏపీకి రుణాలు ఇస్తున్న బ్యాంకుల తీరును రిజర్వుబ్యాంక్ తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు, ప్రభుత్వరంగ సంస్థలకు బ్యాంకులు అప్పులు ఇస్తున్న విధానంపై రిజర్వుబ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల బడ్జెట్ వనరుల నుంచి తిరిగి చెల్లించే పద్ధతిలో అప్పులు ఎలా ఇస్తారని అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను నిలదీసింది. రుణవితరణపై 2015లో తాము జారీ చేసిన సర్క్యులర్ను ఉల్లంఘించి రుణాలు ఎలా ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏయే జాతీయ బ్యాంకులు ఏయే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ఇలా ఎంత మేర అప్పులు ఇచ్చాయో పూర్తి నివేదిక సమర్పించాలని రిజర్వుబ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఆదేశించారు. ఈ రుణాలపై బ్యాంకులు బోర్డులకు నివేదిక సమర్పించి సమీక్షించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలతో.. ఇచ్చిన రుణాలను పోలుస్తూ మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో బ్యాంకులు కిందమీదపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తు ఆదాయాలను ఎస్క్రో చేసి బ్యాంకులు వేల కోట్ల రుణాలను రాష్ట్ర కార్పొరేషన్లకు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చాలా అప్పులు ఇలాంటివే. ఈ విధానం ఇప్పటికే రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయ్యింది. కేంద్ర ఆర్థికశాఖ కూడా దీనిపై కన్నెర్ర చేసింది. తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త విధానంలో అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధికి వచ్చే ఆదాయానికి కోత పెట్టుకుని, ఆ మొత్తాన్ని కార్పొరేషనే వసూలు చేసుకునే అధికారం కల్పించి, ఆ ఆదాయం ఆధారంగా రూ.వేల కోట్ల అప్పులు తీసుకునే కొత్త ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. ఈ విధానమూ పెద్ద వివాదంగా మారింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని రిజర్వుబ్యాంకు ఇంత తీవ్రంగా తీసుకోడానికి.. ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తున్న విధానమే కారణం . ఈ విషయాన్ని ఇప్పటికే కొన్ని బ్యాంకులు బాహాటంగానే చెబుతున్నాయి.