”తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా.. 2014 లో కాంగ్రెస్ కి ఘోర పరాజయం చూపించిన తెలంగాణ ఓటరు… రెండు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రుణం తీర్చుకున్నారు…”
తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ (Congress) చేతిలో బీఆర్ఎస్ (BRS) ఊహించని ఓటమి చవిచూసింది. 2014లో పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తొలిసారి ఓటమిని చవిచూసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నాయకులందరినీ ఏకతాటిపై నడిపించి గెలుపును సుసాధ్యం చేసారు. గ్రూపు విభేదాలతో సతమతమయ్యే కాంగ్రెస్ ని ఏక తాటిపైకి తీసుకురావడంతోపాటు… పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలకు సమర్థుడైన సెఫాలజిస్ట్ ను ఎంపిక చేసుకున్నారు. అతనే సునీల్ కానుగోలు. ఒకప్పటి ఆంధ్రా ప్రాంతానికి చెందిన సునీల్ తలిదండ్రులు కర్ణాటక వలస వెళ్లారు. కాంగ్రెస్ విజయానికి , తెరవెనుక వ్యూహరచన సాగించిన క్రెడిట్.. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu)కు దక్కుతుంది.
కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. అంతర్గత సర్వేలు జరపడం, వ్యూహరచన చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్తగా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వలేదు. అక్కడ అశోక్ గెహ్లాట్, కమల్నాథ్ వంటి నేతలు ప్రధానంగా తమ సొంత వ్యూహాలతోనే ముందుకు వెళ్లారు.
రెండు నెలల క్రితం సునీల్ కొనుగోలుతో సమావేశానికి హైదరాబాద్కు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించారు. పార్టీ ఎన్నికల వ్యూహరచన చేయాలని కేసీఆర్ కోరినప్పటికీ ఆయన సున్నితంగానే ఈ ప్రతిపాదనను నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అడ్వయిజర్గా కూడా ఉన్న సునీల్ కనుగోలు ఇటీవల భారత్ జోడో యాత్ర విజయవంతానికి కీలక వ్యూహరచన చేశారు.