భారత్ను కించపరుస్తూ… జర్మనీకి చెందిన ఓ పత్రిక తాజాగా ప్రచురించిన ఓ కార్టూన్ వివాదాస్పదం అవుతోంది. భారత జనాభా ఇటీవలే చైనా జనాభా దాటిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిబింబిస్తూ భారత్ను హేళన చేసేలా ఓ కార్టూన్ను జర్మనీ మ్యాగజైన్ డెర్ స్పీజెల్ ప్రచురించింది. చైనాకు చెందిన ఆధునిక బులెట్ రైలును, భారత్కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూర్తిగా జాత్యహంకారంతోనే కార్టూన్ను గీశారని కేంద్ర ఎలకా్ట్రనిక్స్-సాంకేతికత శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్లో మండిపడ్డారు. ‘‘డెర్ స్పీజెల్లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది’’ అని ఆయన పేర్కొన్నారు. వాస్తవికతకు కార్టూన్ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ-ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా తేల్చిచెప్పారు. ‘‘హాయ్ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్ స్పీజెల్ కార్టూన్ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు’’ అని ట్వీట్ చేశారు. డెర్ స్పీజెల్ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా సూచించారు.