ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. మరో వైపు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, దాని మిత్ర పక్షం జనసేన సీట్ల పంపకం విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు.
175 అసెంబ్లీ సీట్లకు గానూ జనసేనకు 28-30 స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఆయా సీట్లు ఎక్కడ… అనేది ఇంకా స్పష్టత రాకపోవడంతో కేడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలకు 60-65 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ దూసుకుపోతుంటే.. జనసేన-టీడీపీ మాత్రం నత్తనడకన వెళుతున్నట్లు కనిపిస్తోంది.
జనసేన-టీడీపీ పొత్తు కాంబినేషన్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సీట్ల ప్రకటన ఇంకా వేగంగా సాగాలని ఆయా పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం.. ఇంకా వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ కూడా ఈ రెండు పార్టీల పొత్తులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉండటంతో మరో వారం రోజులపాటు జనసేన – టీడీపీ సీట్ల పంపకం వ్యవహారం కూడా క్లారిటీ వచ్చేలా కనిపించడంలేదు.