గతంలో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చాను.. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా.. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కుప్పంలోని శాంతిపురం సభలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేశామని చెప్పారు.
సాగునీరు, తాగునీరు.
6,300 ఎకరాలకు సాగు నీరు, అలాగే రెండు నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్పారు. 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికే ఉపయోగపడని చంద్రబాబు.. రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు.