” ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కంటే సొంత చెల్లెలు చేస్తున్న ఆరోపణలకు బలం ఎక్కువ. మధ్య నిషేధం, ఏటా డీఎస్సీ జాబ్స్ వంటి కీలక హామీలను గాలికి వదిలేసి.. తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..వీటికి తోడు చెల్లెలు షర్మిల నుంచి ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిస్థితులపై వణికిపోతున్నారు…”
షర్మిల సిద్ధం..
ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్రెడ్డి ఎలా మారిపోయారో షర్మిల చెప్పుకొస్తున్నారు. ఐదేళ్లలో తాను రెండే పర్యాయాలు తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ, తాను ఏమీ ఆశించకుండానే జగన్రెడ్డి కోసం పనిచేశానని , జగన్ కిరాయి మూక తనపై ట్రోల్ల్స్ కి స్వస్తి చెప్పని పక్షంలో మరిన్ని రహస్యాలను వెల్లడి చేస్తానని షర్మిల సిద్ధం అవుతున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి జగన్రెడ్డి కారణం అంటూ అందుకు తన తల్లి విజయలక్ష్మి సజీవ సాక్ష్యం అని చెప్పడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లను ఆమె మూయిస్తున్నారు. షర్మిల తన ఇంటి పేరును వైఎస్గా చెప్పుకోవడాన్ని కూడా జగన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజశేఖర రెడ్డి బిడ్డగా తనకు ఆ హక్కు ఉందని, తన కుమారుడికి రాజశేఖర రెడ్డి స్వయంగా తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్రెడ్డి నుంచి తాను ఏమీ ఆశించలేదని, తాను ఏదైనా ఆశించి ఉంటే ఆ మాట తన తల్లి విజయలక్ష్మితో చెప్పించగలరా అని సూటిగా ప్రశ్నించడంతో జగన్ శిబిరం ఆత్మరక్షణలో పడిపోయింది. ‘పులి కడుపున పులే పుడుతుంది’ అంటూ తాను రాజశేఖర రెడ్డి వారసురాలినే అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మొండితనం విషయంలో జగన్ కంటే షర్మిల రెండు ఆకులు ఎక్కువే చదివారు.
అన్నా చెల్లెళ్ళ మధ్య పోరు..
ఈ నేపథ్యంలో అన్నాచెల్లెలి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్రెడ్డి సానుభూతిని పోగేసుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును హైజాక్ చేశారు. దీంతో తాము కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందడానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేరదీసింది. ఈ క్రమంలోనే దళిత క్రైస్తవులను ఆకట్టుకోవడం కోసం దళితులపై జగన్ది కపట ప్రేమ అని షర్మిల చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం షర్మిల వైపు ఆకర్షితులు కాకుండా ఉండడం కోసం షర్మిల భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణుడు అని, ఆమె ఇకపై ఎంత మాత్రం రెడ్డి కాబోరని జగన్ అనుకూల శక్తులు సరికొత్త లాజిక్ను తెర మీదకు తెచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ తరఫున ప్రచారం చేసి పెట్టిన షర్మిలను రెడ్డి కాదని ఎవరూ వేలెత్తి చూపకపోవడం గమనార్హం. రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ప్రొజెక్ట్ చేశారు. ఆనాడు జగనన్న కోసం పనిచేసిన బాణం ఇప్పుడు పక్కలో బల్లెం అయ్యేసరికి ఆమె భర్త కుల నేపథ్యాన్ని తెర మీదకు తెచ్చారు. అవసరానికి అనుగుణంగా కులాలను వాడుకోవడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య. తన మేనత్తలు దళితులనే పెళ్లి చేసుకున్నారని చెబుతూ దళితులను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్గా దళితుడినే చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతున్న జగన్.. దళితులకు ఆత్మబంధువు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవుల ఓట్లను, ముఖ్యంగా దళిత క్రైస్తవుల ఓట్లను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకోవడానికి షర్మిల భర్త బ్రదర్ అనిల్ సహజంగానే ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే షర్మిల వల్ల రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని జగన్రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులు అందరూ ఒక్కటై జగన్రెడ్డికి వ్యతిరేకంగా మోహరిస్తున్న వేళ అండగా ఉండాల్సిన సోదరి అంతఃపుర రహస్యాలను బయటపెడుతున్న షర్మిల వ్యవహారం జగన్ శిబిరంలో వణుకు పుట్టిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బాబాయ్ వివేకా మర్డర్ వ్యవహారంపై కూడా షర్మిల నోరు విప్పితే జగన్ కి కోలుకోలేని నష్టం జరగవచ్చన్న ఆందోళనలో తాడేపల్లి ప్యాలెస్ లో టెన్షన్ నెలకొంది. .