”అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా.. ఇన్నాళ్లూ పట్టించుకోని నాగార్జున సాగర్ జలాల వ్యవహారం… సరిగ్గా తెలంగాణ పోలింగ్ రోజున తెరపైకి తెచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి…” అంటూ ప్రతిపక్షాలతో పాటు,, మీడియా కూడా కోడై కూస్తోంది. నదీ జలాల్లో హక్కులను కాపాడుకోవడానికి ఎంతకైనా పోరాడతామని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే ఈ పోరాటాన్ని 24 గంటల్లోపే ఎందుకు ఆపారని రైతాంగం నిలదీస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున.. కృష్ణా డెల్టాకు నీటి విడుదల కోసమంటూ నాగార్జున సాగర్ డ్యాంను పోలీసులతో స్వాధీనం చేసుకునేందుకు జగన్ సర్కారు డ్రామా రివర్స్ అయింది. సాగర్లో తమ భూభాగం వరకు ఉన్న గేట్ల నుంచి నీటి విడుదల హక్కు తమకు ఇచ్చేవరకు డ్యాంపై మోహరించిన రాష్ట్ర పోలీసులను వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. అలాంటి హక్కు పొందకుండానే బలగాలను ఉపసంహరించుకోవడం విస్మయపరుస్తోంది. సాగర్లో తగు నీరు లేదని తెలిసీ.. కృష్ణా బోర్డుకు ఇండెంట్ పెట్టకుండా..కనీస సమాచారం ఇవ్వకుండా.. సాగర్పై అర్ధరాత్రి దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించుకునే దుస్సాహసానికి కారణమేంటో ఇప్పటికే అందరికీ అర్థమైంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించేందుకు తన వంతు సాయం చేయడానికి, సెంటిమెంటును రెచ్చగొట్టడానికి జగన్ ఈ మార్గం ఎన్నుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కారు తీరును కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఇండెంటే ఇవ్వకుండా ఏమిటీ రాద్ధాంతమని జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ కూడా ఆక్షేపించారు. తక్షణమే సాగర్ వద్ద నుంచి పోలీసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సూచించారు.
తాము శనివారం తెల్లవారు జామున ఒంటి గంటకు ఐదు టీఎంసీల తాగునీటి కోసం ఇండెంట్ పెట్టామని ఆయన చెప్పారు. దీనిపై కృష్ణా బోర్డు సోమవారం నిర్ణ యం తీసుకుంటుందని.. అందుచేత సాగర్ నుంచి నీటి విడుదల ఆపేయాలని.. పోలీసులను ఉపసంహరించుకోవాలని దేబర్షి పేర్కొన గా… నీటి విడుదల అధికారం రాష్ట్రానికి ఇచ్చేదాకా బలగాలను వెనక్కి పిలిచేది లేదని ఆయన స్పష్టం చేశారు. నీటి విడుదల హక్కు తర్వాత.. కనీసం రాష్ట్ర ఇండెంట్పై కృష్ణా బోర్డు చర్చించిందీ లేదు. కానీ సాగర్ నుంచి నీటి విడుదలను ఆపేశారు. పోలీసు బలగాలనూ వాపసు తీసుకోవాల్సి వచ్చింది.