కార్యకర్తలే టీడీపీకి బలమని, నాయకులు పార్టీ మారినా అండగా నిలిచేది కార్యకర్తలేనని నారా లోకేశ్ అన్నారు. 2014లో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని… ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. తనకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరని… కానీ, దివంగత ఎన్టీఆర్ తనకు 60 లక్షల మంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారని అన్నారు. పలువురు కార్యకర్తల పిల్లలను తన తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారని చెప్పారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తొలుత ఫోన్ చేసింది పవన్ కల్యాణ్.. ఒక అన్నగా అండగా ఉంటానని తనకు చెప్పారని లోకేష్ అన్నారు. ఆరోజు విమానంలో రావాలని పవన్ అనుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని..రోడ్డు మార్గంలో కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. అందుకే టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని ఆయన నిర్ణయించుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు.