ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు పరిణామం చెందబోతున్నాయ్. ఇప్పటికే పొత్తుతో సమయాత్తమైన టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలసి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ-సేనలతో కమలం పార్టీ పొత్తు ఓకే అయితే.. సీటు దక్కించుకోవాలని ఏపీకి చెందిన ఓ కీలక నేత లాబీయింగ్ మొదలెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో టీడీపీలో రాజ్యసభ సీటు సంపాందించి.. తర్వాత బీజేపీలో చేరిన సదరు నేత ఇపుడు ఏదో ఒక పార్లమెంట్ స్తానం నుంచి పోటీకి ప్రయత్నాలు మొదలెట్టారు.
ఫిర్యాదుల పరంపర: పలు బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నేతకు టికెట్ ఇస్తే బీజేపీ పట్ల జనంలో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు అనేకమంది బీజేపీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకరు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఆర్ఎస్ఎస్ ముక్యులు శివప్రకాష్ జీ.. తదితరులకు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు టికెట్ ఇవ్వవద్దంటూ లేఖలు రాసినట్లు ప్రచారం సాగుతోంది. మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్న వారికి బీజేపీ సీట్లు ఇవ్వదని కూడా సదరు నేత ఇప్పటికే బాహాటంగా చెపుతున్నట్లు వినికిడి.
బీజేపీ జాబితా: పొత్తు ఖరారైన పక్షంలో ఏపీలో 6-8 లోక్ సభ స్థానాలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
అరకులోయ, విశాఖపట్నం, ఏలూరు, హిందూపురం, తిరుపతి, రాజంపేట లోక్ సభ స్థానాలలో బీజేపీకి మంచి పట్టుంది. కొన్ని చోట్ల ఇప్పటికే పొత్తుతో సంబందంలేకుండానే కొందరు ఔత్సాహికులు ప్రచారం మొదలుపెట్టుకున్నారు. పై పార్లమెంట్ స్థానాలతో పాటు.. 12-15 అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ తీసుకోవచ్చు. రెండ్రోజులలో పొత్తు ఖరారవుతుందని నేతలు భావిస్తున్నారు.