టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎల్ఎల్బీని స్పె్షల్ ఫ్లైట్ లో ఢిల్లీకి పంపించి ఎస్ఎల్పీ దాఖలు చేయించి… రోజు వ్యవధిలోనే.. ఆ పిటిషన్ కంటే ముందే తన బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని రఘురామ దాఖలు చేసిన మరో పిటిషన్ పై ఇది వరకే సుప్రంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. శుక్రవారం జరిగే విచారణలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా ధర్మాసనం శుక్రవారం జరిపే విచారణ జాబితాలో రఘురామ పిటిషన్ను చేర్చింది.