” 2029 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలని వైఎస్ షర్మిల భారీ స్కెచ్ వేసుకుంటున్నారు. 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఘోర ప్రభావం పొందిన తర్వాత.. ఆ పార్టీ ఖాళీ అయి.. కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆమె అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పికప్ అవ్వకపోయినా.. ఐదేళ్ల వ్యవధిలో గెలుపు ఛాన్స్ వైపు తీసుకువెళ్లగలనని ధీమాతో ఉన్న షర్మిల ఈ మేరకు సీరియస్ గానే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది..”
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల ముందున్న మొదటి టార్గెట్ రాబోయే జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం. దీని కోసం ప్రభావవంతమైన ఓటు షేర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే జీరో పొజిషన్లో ఉంది. ఆ పార్టీ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఎంత వచ్చినా వచ్చినట్లే. అయితే షర్మిల పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని షర్మిల బలం పెంచుకుంటేనే ఆమె రాజకీయ జీవితానికి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు.
వైసీపీ ఓటు పంచుకోవాలి
2024 ఎన్నికలలో ప్రముఖంగా షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్.. వైసీపీ ఓటు ఎక్కువగా చీల్చుకోవాల్సి ఉంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు కూడా కొంత మేరకు షర్మిలకు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 5-6 శాతం ఓట్లు దక్కించుకోగలిగితే.. వైసీపీకి గట్టి దెబ్బె తగులుతుంది.
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంక్ వెనక్కి రావాల్సి ఉంది. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. షర్మిల స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. షర్మిల తీసుకున్న టాస్క్ చిన్నది కాదు. అతి తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని ఏపీలో చూపించాలి. మూడు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తాను బలోపేతం కావాల్సిన క్లిష్టమైన చాలెంజ్ ను షర్మిల తీసుకున్నారు. ఎంత వరకూ ఈ విషయంలో పలితాలు సాధిస్తారనేది.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది. గెలుపోటముల్ని మార్చే అంత ఓటింగ్ శాతం సాధిస్తే.. షర్మిలకు తిరుగులేని రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంచనా వేయవచ్చు. షర్మిల స్కెచ్ సానుకూలంగా సాగితే… 2029 నాటికి ఏపీలో వైసీపీ చాప చుట్టేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు.. అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.