”ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల చిత్రం పునరావృతం కానుందా? తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలసి వెళ్ళడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయా? ” ఈ ప్రశ్నలకు ఢిల్లీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.
ఏపీలో జగన్ ను గద్దె దించి.. అధికార పీఠం దక్కించుకునేందుకు చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతోనూ టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2024 ఎన్నికలు ప్రధాని మోదీకి ఎంత ప్రతిష్టాకరమో… చంద్రబాబు కి అంతకంటే ఎక్కువ కీలకం కానుంది. 2014 లో ఐక్యంగా ఎన్నికలకు వెళ్లిన టీడీపీ-బీజేపీ 2019 నాటికి వివిధ రాజకీయ కారణాలతో దూరమయ్యాయి. ”ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వంటి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలను మోదీ పట్టించుకోకపోవడంతో చంద్రభాబు బీజేపీకి దూరమయ్యారు. అక్కడితో ఆగకుండా ”తగుదునమ్మా..” అని దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేఖంగా ప్రచారం చేసి.. మోడీకి టార్గెట్ అయ్యారు.” 2019 ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైన చంద్రబాబు… తర్వాత కళ్ళు తెరిచారు. చేసిన తప్పుల్ని గుర్తించారు. బీజేపీ తో జట్టు కట్టడానికి మరోమారు సిద్ధమవుతున్నారు.
వైసీపీని నిలువరించగలరా? ఏపీలో 2024 ఎన్నికలలో టీడీపీ-జనసేన కలసి వెళ్ళినా కూడా వైసీపీ అరాచకాలను నిలువరించలేమని భావిస్తున్న టీడీపీ కీలక నేతలు.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. కింది స్థాయిలో కేడర్ మాత్రం బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయినా ఎన్నికలను ధీటుగా పేస్ చేయాలంటే బీజేపీ సహకారం తీసుకోక తప్పదు.. అన్న భావనకు టీడీపీ అధినేత వచ్చినట్లు కనిపిస్తోంది.
జగన్ ఎఫెక్ట్ బీజేపీ ప్రతిష్టకు దెబ్బే : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేఖత ఉంది. రోడ్ల దుస్థితి, నాసిరకం మద్యంతో పేదల ఆరోగ్యాలతో చెలగాటం, ఇసుక, మైనింగ్ దోపిడీ.. ఇలా వేల కోట్ల దోపిడీతో రాష్ట్ర సంపద లూఠీ చేస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ బ్రా0డ్ ను దెబ్బ తీశారంటూ జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ..మోదీ-అమిత్ షా సహకారం మెండుగా ఉందన్న అపవాదు బీజేపీపై పడింది. ఈ ప్రభావం 2024 ఎన్నికలలో బీజేపీపై పలు రాష్ట్రాలలో ఉండే ప్రమాదం కూడా ఉంది. ఈ ఉపద్రవాన్ని పసిగట్టిన కమలనాధులు.. 2024లో జగన్ కి దూరం జరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీతో కలసి వెళ్ళడానికి కేంద్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
నాలుగు లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలు: టీడీపీ-జనసేన ఇప్పటికే పొత్తు ఒప్పందం కుదిరింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో జనసేనకు 24 సీట్లు ఇవ్వడానికి అగ్రిమెంట్ అయినట్లు చెపుతున్నారు. బీజేపీ పొత్తు ఉంటే.. ఆ పార్టీకి నాలుగు లోక్ సభ, 12 నుంచి 14 అసెంబ్లీ స్థానాలకు ఒప్పందం కుదరవచ్చు.. అని కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 2024 సంక్రాంతి నాటికి పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.