వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టులో నేటి ఉదయం (24-4-2023) 9.30కి విచారణ జరగనుంది. వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ని రద్దు చెయ్యాలని కోరారు. మధ్యంతర బెయిల్పై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యవద్దని సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే.. సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఒకవేళ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ని సమర్థిస్తే.. అప్పుడు సీబీఐ ఏం చేస్తుంది అనేది మరో ప్రశ్న.
ఈ కేసులో సీబీఐ ఈమధ్య అరెస్టు చేసిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి ఐదు రోజుల పాటూ సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరు చంచల్గూడ జైలులో ఉన్నారు. వీరిని సీబీఐ.. ఏరోజుకారోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. విచారణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డ్ చేస్తోంది. నేటితో వీరి విచారణ ముగియనుంది. స్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. నిన్న మరోసారి పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు… అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. ముందుగా వివేకా హత్య జరిగిన ఇంట్లోని బాత్రూమ్, హంతకులు.. గోడ దూకి పారిపోయిన ప్రదేశాన్ని పరిశీలించింది. సాక్ష్యాలు ఎలా తారుమారు చేసినట్లు గమనించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండు ఇళ్ల మధ్య దూరం ఎంత ఉందో చూశారు. అవినాష్ రెడ్డి పీఏతో మాట్లాడి.. కొంత సమాచారం రాబట్టారు. ఈరోజు తీర్పుపైనే పులివెందుల ప్రజలతోపాటు.. ఉభయ తెలుగు రాష్ట్రాలలోను సర్వత్రా ఆసక్తి నెలకొంది.