కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం రాగంపేట అంబటి సుబ్బన్న ఆయిల్ ఫాక్టరీ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పరిశ్రమ యాజమాన్యం కూడాఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంక్ను శుభ్రపరిచే సందర్భంలో ఊపిరిఆడక ఏడుగురు కార్మికులు మరణించారని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరుకు చెందిన వారు కాగా… మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారని తెలిపారు. మృతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు.ఈ ఘటనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశామని వివరించారు.
విచారణ కమిటీ ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, జిల్లా పరిశ్రమల అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, పెద్దాపురం ఆర్డీవోలతో కూడిన ఐదుగురులు అధికారుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసారు. మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించామన్న కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అలాగే ఫ్యాక్టరీ తరపున కూడా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్రమాదంతో జిల్లాలో ఇతర పరిశ్రమల్లో అధికారులు అప్రమత్తత చేసారు.