Tirumala Laddu Issue : సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వ్యవహారం…

కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై ప్రసాదం కల్తీ ద్వారా దెబ్బకొట్టిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది .

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం అత్యున్నత న్యాయ స్తానం   సుప్రీంకోర్టుకు  చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు   ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు.

తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని వెల్లడి కావడంతో జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు. ‘‘టీటీడీ ట్రస్ట్ గత మేనేజ్‌మెంట్ హయాంలో మాంసాహార ఉత్పత్తులను ‘ప్రసాదం’ తయారీలో ఉపయోగించినట్టు ఇటీవలి పరిశీలనలో ఆందోళన కలిగించే నిజం బయటపడింది. ముఖ్యంగా పక్షి మాంసం నుంచి తీసిన నూనెలను   (కోలిస్) వాడారు. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడ0 మత విశ్వాసాలపై దాడి చేయడం గా భావించాలి . .  ప్రసాదం తయారీలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమే. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది’’ అని న్యాయవాది సత్యం సింగ్ పేర్కొన్నారు. ప్రసాదం తయారీ, పంపిణీ హిందూమత ఆచరణలో అంతర్భాగమని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో స్థిరపడిందని అన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం ద్వారా భక్తుల హక్కులను ఆలయ నిర్వాహకులు తిరస్కరించినట్టేనని పేర్కొన్నారు.

ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలోనే తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఉన్న సుమారు వంద కోట్ల మంది హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు త్వరలో చారిత్రక తీర్పు వెలువరించి ప్రసాదామ్ పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు ,  వారికి సపోర్ట్ చేసిన వారికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు .