Note for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రిలీఫ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో తీవ్ర  సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ఈరోజు  (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ బదిలీ పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ముగించింది. ఓటుకు నోటు కేసును తెలంగాణా నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చెయ్యాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్‌ దాఖలు చేశారని కోర్ట్ వ్యాఖ్యానించింది. విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోచేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్‌ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్ట్ ఆదేశించింది. సీఎం, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని పేర్కొంది.సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. ట్రయల్‌ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కినట్టయింది.