Micro Plastics : ఉప్పు-చక్కెరలో ప్లాస్టిక్..Toxics link సర్వే

Micro Plastics : భారతదేశం (India) లో ప్లాస్టిక్ భూతం బయటపడింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ వినియోగించే ఉప్పు, చక్కెర ( Salt and Sugar) వంటి పదార్థాల్లో ప్రమాదకర ప్లాస్టిక్ రేణువులు( మైక్రో ప్లాస్టిక్స్) ఉన్నట్లు తేలింది.

అన్ బ్రాండెడ్ తో పాటు బ్రాండ్లలో లభించే ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్ ( Micro Plastics) ఉన్నాయని సమాచారం. టాక్సిక్స్ లింక్ ( Toxics link ) అనే పర్యావరణ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన ‘‘ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ ( Micro Plastics in Salt and Suger) ’’ అనే అధ్యయనంలో  వెల్లడి అయింది. ఇందులో భాగంగా మొత్తం పది రకాల ఉప్పులు మరియు ఐదు రకాల చక్కెరలను సంస్థ అధ్యయనం చేసింది.

ఉప్పు మరియు చక్కెరల్లో వివిధ రూపాల్లో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఫైబర్, పెల్లెట్స్, ఫ్రాగ్మెంట్స్, ఫిల్మ్స్ రూపంలో కనిపించాయని పేర్కొంది. అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉందని తెలిసింది. దాంతో పాటుగా అయోడైజ్డ్ ఉప్పు (Iodized salt) లో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని, అవి పల్చటి ఫైబర్, ఫిల్మ్స్ రూపంలో కనిపించాయని సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ రేణువులపై శాస్త్రీయ డేటాబేస్ కు మరింత సమాచారం జోడించడానికి ఈ అధ్యయనం చేశామని టాక్సిక్స్ లింక్ ఫౌండర్ ఓ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్స్ పై చేసే పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు. అయితే ఉప్పు, చక్కెరలలో మైక్రో ప్లాస్టిక్స్ ఉండటం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ క్రమంలో దీనిపై సమగ్రంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

దేశంలోని ప్రజలు రోజుకు 10.98 గ్రాముల ఉప్పు, 10 చెంచాల చక్కెర తీసుకుంటారని తెలుస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ) ప్రమాణాల కంటే ఎక్కువ. ఇక మైక్రో ప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ఆహారం, నీరు మరియు గాలి ద్వారా ప్రవేశిస్తాయని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది.