ముంబయి: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు బాబా సిద్ధిఖీ స్నేహితుడని.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు. ఈ కేసులో కింది కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి బెయిల్ వచ్చింది. బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింక దైవంతో సమానం. తాము పూజించే కృష్ణజింకను సల్మాన్ వేటాడి చంపాడని.. అతడిని ఎలాగైనా చంపేస్తామని ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించింది. ఇదివరకే సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ మేరకు బిష్ణోయ్ కమ్యూనిటీ అఖిల భారత అధ్యక్షుడు దేవేంద్ర బుధియా ఓ ప్రకటన చేశారు.
సల్మాన్ ఖాన్ తరపున సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణలు చెప్పడంతో అతడు ఈ విషయంపై స్పందించాడు. “సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే బిష్ణోయ్ సంఘం దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. సోమి అలీ ఎలాంటి తప్పు చేయలేదు. అందువలన ఆమె క్షమాపణ అంగీకరించలేము. సల్మాన్ గుడికి రావాలి. ఆ తర్వాత అతడు స్వయంగా క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాత అతడికి విధించే శిక్ష గురించి ఆలోచించవచ్చు” అని అన్నారు.