దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని వర్గాలు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. నమ్మకం ఉంటే దేవుడే దారి చూపుతాడని కూడా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం కన్హెర్సర్లో జరిగిన సత్కార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ తరచుగా మేము తీర్పు చెప్పాల్సిన కేసులు ఉంటాయి. కానీ మేము ఒక పరిష్కారానికి రాలేము. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ వివాదం మూడు నెలలపాటు నా ముందు ఉంది. నేను దైవం ముందు కూర్చున్నాను. నేను ఒక పరిష్కారాన్ని చూపించాల్సి ఉందని దేవుడితో చెప్పాను’’ అని చంద్రచూడ్ వివరించారు. తాను నిత్యం దేవుడిని పూజిస్తానని చెప్పారు. ‘‘ మీకు నమ్మకం ఉంటే దేవుడే ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని చూపిస్తాడు’’ అని అన్నారు.
నవంబర్ 9, 2019న నాటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇక అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన ఈ ధర్మాసనంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది జులైలో అయోధ్య రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.