తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవార గరుడ సేవ నిర్వహించనున్నారు. అందు కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు. తిరుమల గరుడ సేవ రోజున 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఓ శ్యామలరావు తెలిపారు.
అదనంగా విచ్చేసే భక్తులను క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తామని, భక్తుల రద్దీ నేపథ్యంలో 5 వేల మంది పోలీసులతో పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేసినట్టుగా వివరించారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
వేంకటేశ్వర స్వామివారి గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం 400కి పైగా బస్సులు ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు. బస్సుల ద్వారా కొండపైకి 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 1,200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసు విభాగం నుంచి 3,800 మంది విధుల్లో ఉంటారన్నారు. గరుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టుగా చెప్పారు.