విశాఖలో ప్రధాని మోదీ 8-1-2025 న పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు . ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోదీకి ఎయిర్పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
రోడ్ షో: విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో ఏర్పాటు చేశారు . ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన: అదేవిధంగా ప్రధాని పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్ ఏర్పాటుకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును మోదీ వర్చువల్గా శంఖుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మోదీ పర్యటన సమయాలు:
- రేపు సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి విమానంలో విశాఖ చేరుకుని సా.4.45 గంటల నుంచి 5.30 గంటల వరకూ రోడ్డు షో…
- అనంతరం సాయంత్రం 4.45 నుంచి 6.45 గంటల వరకూ ఏయూ ఇంజనీరింగ్ కళశాల మైదానం నుంచి వర్చువల్ గా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- తదుపరి సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి రాత్రి 7.15 గంటలకు భువనేశ్వర్ వెళ్లనున్నారు.
పలు శంఖుస్థాపనలు:
- మోదీ వర్చువల్గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
- అలాగే 16వ జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6 లైన్ల బైపాస్ను జాతికి అంకితం చేయనున్నారు.
- వివిధ జాతీయ రహదార్లు, రైల్వే లైన్లను కూడా ప్రధాని వర్చువల్గా ప్రారంభించనన్నారు.