” 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన , టీడీపీలలోకి వలసలు పెరిగాయ్ . సహజంగానే అధికార పార్టీలోకి వచ్చి చేరే వలస పక్షులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు . అయితే కూటమిలో మరోపార్టీ బీజేపీలో మాత్రం చేరికలు లేవనే చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు , ముగ్గురు ఎంపీలను ప్రజలు గెలిపించినా … ఇక్కడ ఆ పార్టీ సొంతంగా బలపడలేకపోతోంది . వాస్తవంగా ఏపీలో బీజేపీకి ముందు నుంచీ బలంలేదు . అయితే బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి . అయితే ఇప్పటి వరకు ఆ పార్టీకి ఇక్కడ బలమైన నాయకత్వ లేమి ఉంది . ఈ కారణంగా ముందుకుపోలేక చతికిలబడే ఉంటుంది .
తాజాగా ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో బీజేపీ , జనసేన , టీడీపీ పార్టీల కూటమి అప్రతిహత విజయం సాధించింది . ఓటమి పాలైన వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నేతలు జనసేన , టీడీపీ పార్టీలలోకి జంప్ అవుతున్నారు . బీజేపీలో చేరేందుకు కీలక నేతలు ఎవరూ పెద్దగా ఇష్టపడటంలేదు . ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో కూడా బీజేపీ పరిస్థితి మెరుగవుతుందో . . లేదో నన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ప్రధానంగా కనిపిస్తోంది . ఈ కారణంగా ఆ పార్టీలో చేరికలు లేవని చెప్పాలి .
2029 ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు అక్కడ పార్టీ నేతలు బలమైన వ్యూహాలు రూపొందుచుకుంటున్నారు . తెలంగాణలో ఎలాగూ బిఆర్ఎస్ బాగా బలహీనపడింది . అధికార కాంగ్రెస్ పార్టీపై ఈ నాలుగున్నరేళ్లలో కొంత వ్యతిరేఖత ఎలాగూ వస్తుంది . దీంతోపాటు . . తెలంగాణలో కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య ఉన్న వైరం ఎలాగూ ఆ పార్టీని 2029 ఎన్నికలలో గెలుపు అవకాశాలకు దూరంగా ఉంచుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి . ఈ నేపథ్యంలో 2029 లో తెలంగాణ అసెంబ్లీలో కమలం పార్టీ పాగా వేయబోతోందన్న అంచనాలు రాజకీయ వర్గాలలో నెలకొన్నాయి .
ఆంధ్రాలో మెరుగుపడుతుందా ? అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బలమైన నేతలు అతి కొద్దిమంది మాత్రమే బీజేపీలో ఉన్నారు . ముందు నుంచీ బీజేపీలో ఉన్న నేతలలో కీలకమైన నేతలు ఇప్పటికీ వైసీపీతో లాలూచి కొనసాగిస్తున్నారు . మధ్యలో వచ్చి చేరిన కొందరు నేతలు ఇంకా టీడీపీ అడుగుజాడలలోనే నడుస్తున్నారు . ఈ కారణాలు ఏపీలో బీజేపీ భవిష్యత్తులో కూడా బలపడుతుందా ? అనే అనుమానాలకు దారితీస్తోంది . ఏపీ పై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్ సారించి . . 2029 నాటికి కాకపోయినా . . 2034 ఎన్నికలకైనా సొంతంగా పోటీ చేసే బలం చేకూర్చగలరా ? అనుమానంగానే కనిపిస్తోంది . వీటన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం , వైసీపీ , జనసేన బలమైన ప్రాంతీయ పార్టీలు . వీటిని కాదని బీజేపీలో చేరడానికి కీలక నేతలు ఆసక్తి చూపకపోవడం అన్నింటి కంటే బలమైన కారణంగా చెప్పవచ్చు .