నటుడు మోహన్ బాబు ఇటీవల వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. తన కొడుకు మనోజ్ తో గొడవలు ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దాడికి సంబంధించిన కేసులో ఆయనను విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో మోహన్ బాబు మాత్రం చిక్కడం లేదని మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
అంతే కాకుండా ఆయన దుబాయి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన తరఫు న్యాయవాదులు మాత్రం ఆ రూమర్లను ఖండించారు. భారత్లోనే ఉన్నారని చెబుతున్నారు. మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో జల్పల్లిలోని తన నివాసంలో వార్త కవరేజ్ కోసం వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు మోహన్ బాబు. జర్నలిస్టు నుంచి మైకు లాక్కొని అతడి ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పై ఆయన మీడియాకు లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును కూడా పరామర్శించారు.
ఆసుపత్రిలో అతనితో పాటు కుటుంబ సభ్యులకు కూడా సారీ చెప్పారు. అయితే, జర్నలిస్టుపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మోహన్ బాబును విచారించేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.