మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాసు పీకారా..

ఏపీ సీఎం చంద్రబాబు తమ మంత్రులపై కీలక వాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆయన మంత్రులకు క్లాస్ పీకినట్టు సమాచారం. మంత్రులు సచివాలయానికి, క్యాంప్ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని గట్టిగా చెప్పారట. ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని, టెక్నాలజీ వాడటం లేదని మండిపడ్డారట.  

ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే.. ఇన్‌చార్జులుగా ఉన్నవారు జిల్లాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం బాధ్యతలను తీసుకోవాలని, మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంలో కొందరు వెనుకబడి ఉన్నారన్నారు. విపక్షాల దుష్ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టాలని సూచించారు. 

త్వరలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని, ఆ క్రమంలోనే ముగ్గురు లేదా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నానని, మీ జాతకాలు తన వద్ద ఉన్నాయని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడంతో పలువురు మంత్రుల్లో కలకలాన్ని రేపుతోంది. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.