బీజేపీకి అంబేడ్కరిస్తులకు వార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అలాగే సౌత్ కు నార్త్ కు వైరుద్ధ్యం నడుస్తూనే ఉంటుంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వచ్చిన రియాక్షనే అందుకు ఉదాహరణ. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ తాజాగా చేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కేర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే అలెర్జీ అని, ఇంకా చెప్పాలంటే గిట్టదు అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో విజయ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేయడం మరింత కీలకంగా మారింది.
దేశ పౌరులందరికీ అంబేడ్కర్ ఎంతో స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి అని విజయ్ కొనియాడారు. ఆయన వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అని, సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక అని విజయ్ పేర్కొన్నాడు. “అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. మన హృదయాలలో, మన పెదవులపై ఆనందంతో ఆయన నామాన్ని జపించుదాం” అని పిలుపునివ్వడం అంబేడ్కర్ వ్యతిరేకుల్లో చర్చకు దారితీస్తోందని అనుకూల వర్గాలు చెప్తున్నాయి.
ఇక ఉత్తర తమిళనాడులోని విక్రవాండిలో తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా టీవీకే సైద్ధాంతిక గురువులలో అంబేద్కర్ను విజయ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం గణనీయమైన దళిత జనాభాను కలిగి ఉంది. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ థోల్ కంచు కోటగా పరిగణించబడుతుంది. తిరుమావళవన్ స్థాపించిన వీసీకేని గతంలో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. డిసెంబర్ 17న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా విపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని, ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు జపిస్తే స్వర్గానికి చేరుకునేవారని ఆయన అన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.