మూడు వేదికలు – ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా
మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది . మే 2వ తేదీన అమరావతికి వస్తున్నారు భారత్ ప్రధాని . రాజధాని అమరావతిలో 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.
లక్ష కోట్ల ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా . ..ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను పరిశీలించి ఖరారు చేసారు . దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
పటిష్టమైన వేదికలు . . ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.
జనం రాక కోసం . .రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్యాక్సెస్ రోడ్డు, ఎన్10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు.
గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్ప్లాజా సమీపంలోని మురుగన్ హోటల్ వద్ద ఎన్హెచ్-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్హెచ్ బైపాస్ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్ఆర్ జంక్షన్, గోరంట్ల, లామ్-తాడికొండ క్రాస్రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్11, ఇ8, ఎన్10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.
హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు .