ఊహించినట్టుగానే టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో బెంగాల్ రాష్ట్రమంత్రి పార్థా ఛటర్జీని ఈడీ శనివారంనాడు అరెస్టు చేసి రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుంది. అంతకుముందు మంత్రికి సన్నిహితురాలిగా పేరొందిన అర్పితా ముఖర్జీ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 20 కోట్ల నగదు పట్టుబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ తరువాత మంత్రి పార్థా ఛటర్జీని కూడా అరెస్టు చేసింది. సోమవారం మంత్రిని కోర్టులో హాజరుపరచి ఆయనను విచారించేందుకు 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఈ స్కాంతో సంబంధముందని భావిస్తున్న మరికొందరి నివాసాల్లోనూ కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోల్కతా లోనిఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్కు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. నక్తాలాలోని ఛటర్జీ నివాసంలో ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. తన నివాసంలో భారీగా నోట్ల కట్టలతో ఈడీకి దొరికిన మంత్రి సహాయకురాలైన అర్పితా ముఖర్జీ గతంలో పలు బెంగాలీ చిత్రాలతోపాటు, ఒడియా, తమిళ చిత్రాల్లోనూ నటించింది. కోల్కతా నగరంలో భారీస్థాయిలో నిర్వహించే దుర్గాపూజల కమిటీ ప్రచారకర్తగా ఉన్న సమయంలో ఆమెకు మంత్రితో పరిచయమేర్పడినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ముందుముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో.. మరెంతమంది అరెస్టవుతారోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా తాజా పరిణామాలపై టీఎంసీ నేతలు బీజేపీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఈడీని బీజేపీ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోందని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. దేశం ఇప్పుడు బీజేపీ పాలిత, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాలుగా చీలిపోయినట్టుగా కనిపిస్తోందని ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్ విమర్శించారు.