‘పిల్లలే కాదు. చాలా మంది పెద్ద వాళ్ళు కూడా చాకోలెట్స్ అంటే చెవి కోసుకుంటారు. అయితే మీరు ఇష్టంగా తినే చాకోలెట్స్ అన్నీ సురక్షితం కాదు. చాలా కంపెనీలు చాకోలైట్స్ తయారీలో నాణ్యత పాటించకపోవడం ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తోంది.’
ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ కలకలం రేగింది. బారీ కాలెబాట్ గ్రూప్ నిర్వహణలో బెల్జియంలోని వైజ్ పట్టణంలో ఉన్న కంపెనీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. లిక్విడ్ చాక్లెట్ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో.. తదుపరి నోటీసు వెలువడే వరకు తయారీని నిలిపేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. మరోవైపు.. ఇక్కడ తయారు చేసిన అన్ని ఉత్పత్తులను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. దక్షిణ బెల్జియం ఆర్లోన్లోని ఫెర్రెరో ఫ్యాక్టరీలో ఇదే తరహా సాల్మొనెల్లా కేసు బయటపడిన వారాల వ్యవధిలోనే ఇది వెలుగుచూడటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తి రంగంలో ‘బారీ కాలెబాట్’.. ప్రపంచ నంబర్ వన్ సంస్థ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తులు విక్రయించింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా ఉత్పత్తి కేంద్రాలు, 13 వేలకుపైగా ఉద్యోగులున్నారు. ఇదిలా ఉండగా.. సాల్మొనెల్లా రకం బ్యాక్టీరియాతో ‘సాల్మొనెలోసిస్’ వ్యాధి ప్రబలుతుంది. ఇది సోకినవారిలో అతిసారం, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ‘సాల్మొనెల్లా టైఫీ’ రకం బ్యాక్టీరియాతో టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది.