“తెలంగాణ చుట్టూ ఉన్న పలు రాష్ట్రాలలో ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు.. చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మణిదీపంలా వెలుగుతోంది” అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధించాం. అంతేకాదు.. సాధించిన తెలంగాణను దేశానికి రోల్మోడల్గా నిలిచేలా చేశామన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు పోయేవారు. ఇవాళ వలసలు రివర్స్ వచ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మన వద్దకు వలసలు వస్తున్నారు. బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్మిల్లులు నడవవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెరాస ప్రభుత్వ స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే మన స్థాయి రూ.14.50 లక్షలుగా ఉండేదని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక యువశక్తి భారత్లో ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు అంటూ ప్రశ్నించారు. దేశ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నిరంతర వెలుగుజిలుగులు: మోదీ నేతృత్వం వహించిన గుజరాత్లోనూ విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్తో వెలుగుజిలుగులు కనిపిస్తున్నాయని.. చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మణిదీపంలా వెలుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.