దశాబ్దాలుగా అమలులో ఉన్న జీవోను తెలంగాణ సర్కారు ఎత్తివేసింది. భాగ్య నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందు చూపుతో తీసుకువచ్చిన జీవోను రద్దు చేయడంపై పలువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ ఎత్తివేత వల్ల బెనిఫిట్ పొందుతున్న 84 గ్రామాల్లో భూములు ఉన్న వారు మాత్రం రియల్ భూమ్ వస్తుందన్న ఆనందంతో ఉన్నారు.
111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. 84 గ్రామాలకు 111 జీవో నిబంధనల నుంచి విముక్తి లభించినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్పల్లి, చేవెళ్ల, షాద్నగర్, షాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ట్రిపుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్… చివరికి జీవో నెంబర్ 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ వన్ జీవో రద్దుపై సీఎఎస్ నేతృత్వంలో కమిటి కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో కలిసి కమిటిని ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్జోన్స్ డిక్లేర్ చేస్తూ… మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. జీఓ నెంబర్ 111.. సుమారు 25 ఏళ్ల నుంచి వినిపిస్తున్న ప్రభుత్వ ఆర్డర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూసీ నదితో పాటు, హైదరాబాద్కు తాగునీరందించిన జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం 1996లో ట్రిపుల్ వన్ జీవోను తీసుకొచ్చింది. తాజాగా ట్రిపుల్ 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్ తీర్మానం చేయడంతో ఆ పరిధిలోని 84 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోక్షగుండం ముందు చూపుతో…1996 నాటికి హైదరాబాద్ అభివృద్దిని అంచనా వేసి తాగునీటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో.. జంట జలాశయాలను కాపాడటానికి ఉమ్మడి రాష్ట్రంలో 111 జీవోను తీసుకొచ్చారు. లక్షా 32 వేల ఎకరాల భూమి, 84 గ్రామాల్లో విస్తరించి ఉంది. 1908లో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశరయ్య హైదరాబాద్ కు వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ను నిర్మించారు. 4 వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరానికి పైపులతో మంచి నీళ్లు అందించేలా ప్లాన్ చేశారు. అయితే తాగునీరు కలుషితం కాకుండా ఉండాలని, ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, ఫ్యాక్టరీలు పెట్టినా పర్యావరణం దెబ్బతింటుందని అప్పటి ప్రభుత్వం 111 జీవోకి ప్రాణం పోసింది. ఇప్పుడు అది ఎత్తివేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
ఈ జీవో ఎత్తివేత ద్వారా హైదరాబాద్ కిజీవనాడి లాంటి జలాశయాలకు ఊపిరి తీసినట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి 111 జీవో ప్రకారం ఈ 84 గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి భవంతులు నిర్మించరాదు. లే అవుట్స్ ఏర్పాటు చేయకూడదు. చెక్ డ్యాములు, లిప్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకుండా స్థానిక సంస్థల ఆథారిటీకి ఆ బాధ్యత ఇచ్చారు. అయితే.. చాలావరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ జీవో ఎత్తివేతతో ఇకపై ఇంకా పెద్ద పెద్ద భవంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ భూముల్లో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు సదరు బడా నేతలకు లబ్ధి చేకూర్చేందుకే జీవోను రద్దు చేశారని ప్రతిపక్ష నేతలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.