తెలంగాణలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వెళ్లే మార్గంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బండిసంజయ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను కూడా కరీంనగర్ జైలుకు తరలించారు.
కాగా.. హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పోలీసులు హాజరుపరచగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని న్యాయవాదులు వాదించారు. సంజయ్ తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు ముగిశాయి.
ఈ అంశంపై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ టెన్త్ హిందీ పేపర్ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రశాంత్, మహేష్ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్కు పంపారని, బండి సంజయ్కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్ తన దగ్గర ఫోన్ లేదన్నారని సీపీ చెప్పారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఈ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని, బండి సంజయ్ అరెస్ట్పై లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చామని సీపీ తెలిపారు. కాగా తమపై రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ సర్కారు ఈ నేరం మోపినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.