‘స్కూల్ లో ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పకపోయినా, బడిలో సరైన సదుపాయాలు లేకపోయినా పేరెంట్స్ ఆందోళన చేయడం సాధారణ విషయమే. కానీ అర్దాంతరంగా బడి మానేసిన విద్యార్థులను స్కూల్ కి పంపాలని వారి ఇళ్ల ముందు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం ఎక్కడైనా చూసారా? హ్యాట్సఫ్ టీచర్స్..’
తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కర్ణంగడ్డ గ్రామంలో జరిగింది ఈ ఘటన. స్థానిక పొతంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కర్ణంగడ్డకు చెందిన 30 మంది విద్యార్థులు 20 రోజుల నుంచి హాజరు కావడంలేదు. గైర్హాజరవుతున్న విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటూ స్వయంగా ప్రధానోపాధ్యాయుడు సహా ఉపాధ్యాయులు వారి ఇళ్ల ముందు బైఠాయించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తండా నుంచి పొతంగల్ వరకు 3 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు దారుణంగా మారిందని, అందుకే విద్యార్థులను పంపడం లేదని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. రోడ్డుకు మరమ్మతులు చేయిస్తేనే పిల్లలను పాఠశాలకు పంపిస్తామని కరాఖండిగా చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు గంటపాటు విద్యార్థుల ఇంటి ముందు బైఠాయించారు. సమస్యను సర్పంచి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పారు. ఆ వెంటనే 20 మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విద్యార్థుల చదువు కోసం తాపత్రయపడుతున్న ఉపాధ్యాయులను జనం అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి గురువులు ఉంటే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.